నాగ్‌ అశ్విన్‌ అసాధారణ ప్రతిభావంతుడు.. ఆయన చిత్రాల తీరు చూస్తేనే అర్థం అవుతుంది: కమల్‌ హాసన్‌

నాగ్‌ అశ్విన్‌ అసాధారణ ప్రతిభావంతుడు.. ఆయన చిత్రాల తీరు చూస్తేనే అర్థం అవుతుంది: కమల్‌ హాసన్‌

3 days ago | 10 Views

సాధారణంగా కనిపించే చాలామంది వ్యక్తుల్లో అసాధారణ ప్రతిభ దాగి ఉంటుందని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ను ఉద్దేశించి నటుడు కమల్‌ హాసన్‌ చెప్పిన మాటలివి. సామాన్యుడిగా కనిపించినా అసాధారణ ప్రతిభ అశ్విన్‌ సొంతం. రూ.4 వేల రెమ్యూనరేషన్‌ తీసుకునే పరిస్థితి నుంచి రూ.600 కోట్ల బడ్జెట్‌తో సినిమా తెరకెక్కించే స్థాయికి చేరుకున్న ఆయన ప్రయాణం ఆసక్తికరం. 'కల్కి 2898 ఏడీ’   విడుదల సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు మనముందున్నాయి. అశ్విన్‌ మితభాషి అయినా.. పనుల్లో ఎవరూ ఊహించనంత చురుగ్గా ఉంటారు. ఆ చొరవే విద్యార్థి దశలో 'స్కూల్‌ మ్యాగజైన్‌’కు ఎడిటర్‌ను చేసింది. కథనాలు, వ్యాసాలు రాయడం అప్పుడే ప్రారంభించారు. హీరో రానా దగ్గుబాటి ఈయన క్లాస్‌మేట్‌. నాన్న జయరామ్‌రెడ్డి, అమ్మ జయంతి.. ఇద్దరూ వైద్యులే. తల్లిదండ్రుల్లా డాక్టర్‌గా కాకుండా సినీరంగంలోకి అడుగు పెట్టారు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ని మొదలుపెట్టి.. దర్శకుడిగా ఎదిగి తల్లిదండ్రులు గర్వపడేలా చేశారు. తల్లి ప్రోద్బలంతో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా మార్చేందుకు దర్శకుడు శేఖర్‌ కమ్ముల దగ్గరికి పంపారు.

'గోదావరి’ చిత్రీకరణ జరుగుతున్న సమయమది. 'తర్వాత ప్రాజెక్టుకు కలిసి పనిచేద్దాం’ అని శేఖర్‌ సమాధానం ఇచ్చారు.  అప్పటివరకూ ఖాళీగా ఉండడం ఇష్టపడని నాగ్‌.. మంచు మనోజ్‌ హీరోగా తెరకెక్కిన 'నేను విూకు తెలుసా?’కు అసిస్టెంట్‌గా పనిచేశారు. తొలి సంపాదనగా రూ. 4 వేలు అందుకున్నారు. 'లీడర్‌’,'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ చిత్రాల విషయంలో శేఖర్‌.. అశ్విన్‌కు ఇచ్చినమాట నిలబెట్టుకున్నారు. నాగ్‌ చేసిన 'లీడర్‌’ ట్రైలర్‌ కట్‌ శేఖర్‌కు నచ్చడంతో దాన్నే విడుదల చేయడం విశేషం. 'సినిమాని ఎంత స్నేహపూర్వక వాతావరణంలో తీయొచ్చో ఆయన వద్దే నేర్చుకున్నా’ అని ఓ సందర్భంలో గురువును కొనియాడారు.'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ తర్వాత స్నేహితులతో కలిసి ఓ యాడ్‌ తీశారు. ఆ తర్వాత రూపొందించిన లఘు చిత్రం.. ఓ ఫిల్మ్‌ఫెస్టివల్‌ వరకు వెళ్లింది. అదే.. ఆయన వృత్తి, వ్యక్తిగత జీవితాన్ని మార్చేసింది. ఆ షార్ట్‌ఫిల్మ్‌ చూసిన ప్రముఖ నిర్మాత అశ్వనీదత్‌ కుమార్తెలు ప్రియాంక, స్వప్న సినిమా అవకాశాన్ని ఇచ్చేందుకు ముందుకొచ్చారు.

ఆ క్రమంలో నాగ్‌ అశ్విన్‌ వారికి ఓ కథ వినిపించారు. మరోవైపు, 'ఎవడే సుబ్రమణ్యం’ స్క్రిప్టు పూర్తి చేశారు. 'సుబ్రమణ్యం..’ను నిర్మించాలని ఫిక్స్‌ అయ్యారు. అలా నాని, విజయ్‌ దేవరకొండ ప్రధాన పాత్రల్లో అశ్విన్‌ తొలి కథ తెరపైకొచ్చింది. ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. ఈ తరానికి నటి సావిత్రి గురించి చెప్పాలనే సంకల్పంతో 'మహానటి’ని తెరకెక్కించారు. మూడో చిత్రమైన 'కల్కి’ కథ రాసేందుకు 5 ఏళ్లు పట్టింది. సైన్స్‌కు మైథాలజీ జోడించి  తెరకెక్కించిన ఈ పాన్‌ ఇండియా మూవీ బ్జడెట్‌ దాదాపు రూ.600 కోట్లు. ప్రభాస్‌ హీరో. సినీ ప్రయాణంలో స్నేహితులైన అశ్విన్‌..  ప్రియాంకలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఓ బాబు. కామెడీ చిత్రాలను ఆస్వాదించే నాగ్‌ 'జాతి రత్నాలు’ కోసం నిర్మాతగా మారారు. ఆంథాలజీ డ్రామా 'పిట్ట కథలు’లోని ఓ సెగ్మెంట్‌కు దర్శకత్వం వహించారు. 'ఎవడే సుబ్రమణ్యం’, 'మహానటి’లో ఉన్నట్టే 'కల్కి’లోనూ చాలా అతిథి పాత్రలున్నాయి. కమల్‌ హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొణెలాంటి అగ్రనటుల కీలక పాత్రలతోపాటు మరికొందరు తళుక్కున మెరవనున్నారు. తొలి చిత్రంతో స్టేట్‌ (నంది) అవార్డు, రెండో సినిమాతో నేషనల్‌ అవార్డు పొందిన నాగ్‌ అశ్విన్‌, మూడో మూవీతో ఇంటర్నేషనల్‌ అవార్డు అందుకోవాలని సినీ ప్రియులంతా ఆశిస్తున్నారు.

ఇంకా చదవండి: "నేను-కీర్తన"తో చిమటా రమేష్ బాబు విజయభేరి మ్రోగించాలి!!

# Kalki 2898 AD     # Prabhas     # Deepika Padukone     # Kamal Haasan     # Disha Patani    

related

View More
View More